అడిషనల్ కలెక్టర్ ఏసీబీ ట్రాప్… రైతుల సంబరాలు…

దిశ దశ, వరంగల్:

అడిషనల్ కలెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టబడడంపై పై రైతులు సంబరాలు చేసుకున్నారు. తమకు అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన ఆయనకు తగిన శాస్తి జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం హన్మకొండ అడిషనల్ కలెక్టర్, ఇంఛార్జి డీఈఓగా పని చేస్తున్న వెంకట రెడ్డి రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. ఆయన వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులు తమ ఉసురు తాకే ఏసీబీకి పట్టుబడ్డాడంటున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం భూములు కోల్పోయిన భాధిత రైతులకు న్యాయంగా రావల్సిన పరిహారం ఇప్పించడంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి అడ్డుపడ్డాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఆయన తీరు వల్ల తమకు తీరని అన్యాయం జరిగిందని అటువంటి అధికారి ఏసీబీకి పట్టుబడడం సమంజసమేనని అంటున్నారు. ఈ మేరకు శనివారం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు టపాకాయలు కాల్చిన రైతులు వెంకటరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.